ఫోన్ కాల్స్ కు స్పందించని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నాం: మంత్రి గుడివాడ అమర్నాథ్

  • ఒడిశాలో ఢీకొన్న మూడు రైళ్లు... 288 మంది మృతి
  • సీఎం ఆదేశాల మేరకు ఒడిశా వెళ్లిన మంత్రి అమర్నాథ్ బృందం
  • అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని సీఎం చెప్పారన్న అమర్నాథ్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలోని ఏపీ వాసులను ఆదుకునేందుకు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తరలి వెళ్లారు. ఆయన వెంట ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. 

ఒడిశా రైలు ప్రమాదంలో 178 మంది తెలుగువారు ఉన్నారని, అధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. విజయవాడలో 39 మంది దిగాల్సి ఉండగా, వారిలో 23 మంది స్పందించారని, ఐదుగురి ఫోన్లు స్విచాఫ్ అని వస్తున్నాయని, మరో ఐదుగురు ఫోన్లు లిఫ్ట్ చేయడంలేదని తెలిపారు. ఇద్దరి ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తోందని వివరించారు. 

ప్రస్తుతం ఫోన్ కాల్స్ కు స్పందించని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారని, అవసరం అయితే ఎయిర్ అంబులెన్స్ ల సాయం కూడా తీసుకోవాలని స్పష్టం చేశారని వివరించారు.

Gudivada Amarnath
Train Accident
Balasore
Odisha
Jagan
Andhra Pradesh

More Telugu News